ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ నేడు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నట్లు బాబు మోహన్ ప్రకటించారు. ఆందోల్ నియోజకవర్గంలో ఆయన సభ్యత్వం తీసుకున్నారు. ఈ మేరకు బాబు మోహన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాబు మోహన్ తొలిసారి 1998లో ఆందోల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. తర్వాత టీఆర్ఎస్లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయారు. ఆయన 2023 ఫిబ్రవరి 7న బీజేపీకి రాజీనామా చేసి మార్చి 4న ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఇప్పుడు ఇన్నేళ్లకు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.