ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం. 2025-26 సంవత్సరానికి గానూ రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లుగా ప్రకటించారు. మూలధన వ్యయంగా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు అంచనా వేశారు. ప్రభుత్వం అన్ని రంగాలకు భారీగా కేటాయింపులు జరిపింది. ప్రధానంగా వ్యవసాయం, విద్య, స్కిల్ డెవెలప్మెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, శిశు, మహిళా సంక్షేమాలకు భారీగా నిధులు కేటాయించారు.
శాఖల వారీగా కేటాయింపులివే…
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.27,518 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు, జలవనరుల శాఖకు – రూ.18,019 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు, ఆర్అండ్బీకి రూ.8,785 కోట్లు, హోం శాఖకు రూ.8,570 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.4,332 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు, దీపం పథకానికి రూ.2,601 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు, ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు, యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు, ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు,తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు, మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు కేటాయించారు.