వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఈ ఏడాది బాణసంచా తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రానున్న దీపావళి వేడుకల సందర్భంగా అన్ని రకాల బాణసంచాపై ఈ నిషేధం కొనసాగనుంది. బహిరంగ మార్కెట్లలో అమ్మకాలతో పాటు, ఢిల్లీలో ఆన్లైన్ అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జనవరి 1, 2025 వరకు అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, దీపావళి సందర్భంగా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించడం ఇది నాలుగోసారి. ప్రజలంతా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.