ప్రజలకు ఇచ్చిన మాట తప్పి మడమ తిప్పడమే కాంగ్రెస్ మార్కు పాలనా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారు, ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారంటూ మండి పడ్డారు. ముందు రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9, 2023 కు చేస్తామన్నారని, తర్వాత ఆగస్ట్ 15, 2024 వరకు అని, ఆ తర్వాత దసరా వరకు అంటూ నేటికీ 20 లక్షల పై చిలుకు రైతులకు రుణమాఫీ అందకుండా చేశారన్నారు. రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేలు, డిసెంబర్ 9, 2023 తర్వాత తీసుకుంటే రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పి వానకాలం రైతు భరోసా ఎగవేశారన్నారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని అన్నారని, మాట మార్చి 26 జనవరికి అని చెప్పి ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేశాడని విమర్శించారు. ఆసరా రూ.4 వేలు, తులం బంగారం, మహిళలకు రూ.2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలని సెటైర్లు వేశారు.