బీఆర్ఎస్ నేతలపై సర్కార్ అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడిని ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరీష్ రావు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదల ఇండ్లు ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకు వారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజా పాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.