మాట‌లు కోట‌లు దాటినా.. చేత‌లు గ‌డ‌ప దాట‌లే

సీఎం రేవంత్ రెడ్డి మాట‌లు కోట‌లు దాటినా చేత‌లు మాత్రం గ‌డ‌ప దాట‌లేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీష్ రావు విమ‌ర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల‌కు జీతాలు రాక‌పోవ‌డంపై హ‌రీష్ రావు ఎక్స వేదిక‌గా మండిప‌డ్డారు. 16 వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేట‌న్నారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నార‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వీరికి ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు. పథకాల్లో కోతలు పెట్ట‌డ‌మే కాకుండా, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నార‌న్నారు. ఇది ప్రజా పాలన కాద‌ని, ప్రజా వ్యతిరేక పాలన అని విమ‌ర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ హోంగార్డులకు త‌క్ష‌ణ‌మే వేత‌నాలు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *