సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితులను ప్రస్తావిస్తూ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను జోడిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లు రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్మంటూ పరుగులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై అంటోందని సెటైర్లు వేశారు. కేసీఆర్ పాలనలో రియల్ భూమ్ కొనసాగింది ఎట్ల.. కాంగ్రెస్ పాలనలో ఆగిపోవడం ఎట్ల? అని ప్రశ్నించారు. కేవలం పరిపాలన దక్షత లోపం, విజన్ లేని పాలనా విధానం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఆదాయానికి జీవధార రియల్ రంగంపై హైడ్రా వేటు పడిందన్నారు. ముందు చూపు లేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు పొడుస్తున్నారని విమర్శించారు.