ప్రభుత్వం వైసీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ నేతలపై వరుస కేసులు, అరెస్టులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పేర్ని నాని మంగళవారం మచిలీపట్నంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో సివిల్ సప్లై శాఖలో ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారని తెలిపారు. చట్ట ప్రకారం ఎవరిపై పెట్టకూడని కేసులు తన కుటుంబంపై పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో తనకు ఇలాంటి వేధింపులు కొత్తేం కాదని.. కేసులకు భయపడేది లేదని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా మాజీ సీఎం జగన్, వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. సివిల్ సప్లై శాఖ మంత్రి స్వయంగా వెళ్లి టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే వారిపై ఎందుకు క్రమినల్ కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయడం , వారిని అరెస్టు చేయడమే పని పెట్టుకున్నట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.