నేను ఎవ్వ‌రి ప్ర‌లోభాల‌కు లొంగ‌లేదు – విజ‌య సాయి రెడ్డి

వైసీపీలో సొంత పార్టీ నాయ‌కుల రాజీనామాల‌తో రాజకీయం స‌రికొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఇటీవ‌ల ఆ పార్టీ నేత , ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి పార్టీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వైయ‌స్ జ‌గ‌న్ నిన్న జ‌రిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే న‌లుగురు వెళ్లిపోయార‌ని, రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాల‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.ప్రలోభాలకు లొంగి, భయపడో రాజీపడి అటువైపు పోతే వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏమున్న‌ట్లు అని ప్ర‌శ్నించారు. సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే అని, వైసీపీ పార్టీ ఉందంటే వారి వ‌ల్ల కాద‌ని, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే పార్టీ ఉంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. దీనిపై నేడు విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. ‘‘నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు లోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా’’ అని విజ‌య‌సాయిరెడ్డి రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *