విజయనగరం జిల్లాలో డయేరియా బాధితులను వైసీపీ అధినేత వైయస్ జగన్ పరామర్శించారు. ఈ రోజు ఉదయం ఆయన గుర్లకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలతో సైతం మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయన్నారు. వైసీపీ హయాంలో గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లతో ప్రజలకు గ్రామంలోనే అన్ని రకాల సేవలందిస్తే ఇప్పుడు గ్రామంలో ఏ ఒక్కటి లేకుండా చేశారని మండిపడ్డారు. విలేజ్ క్లినిక్లలో అందుబాటులో ఉండే వైద్య సేవలను దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండేదని, దాంతో ఇంటింటికీ డాక్టర్లు వెళ్లి వైద్య పరీక్షలు చేసేవారన్నారు. ఇప్పుడు దాన్ని లేకుండా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే డయేరియాతో ప్రజలు చనిపోయారన్నారు. సెప్టెంబర్ 20వ తేదీన తొలి డయేరియా మృతి కేసు నమోదైతే నెల రోజులైనా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. తాగు నీటి పారిశుద్ధ్యంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. గుర్లలో 300లకు పైగా ప్రజలు డయేరియాతో చికిత్స పొందుతున్నారని, అక్కడ సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం వీడి ఆస్పత్రిలో సౌకర్యలు మెరుగు పర్చాలని డిమాండ్ చేశారు.