బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో మద్యం వినియోగం తగ్గిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సత్యమేవ జయతే అని పేర్కొంటూ హరీష్ రావు ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు చేశారు. తెలంగాణలో మద్యపానం పెరగడానికి కేసీఆర్ ప్రభుత్వ విధానాలే కారణమన్న వాదనను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5, ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 డేటాతో కొట్టిపారేసిందన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో సమర్పించిన అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణలో మద్యం వినియోగం వాస్తవానికి తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. తెలంగాణలో పురుషుల మద్య వినియోగం 2015-16లో 53.8% నుండి 2019-21 నాటికి 50% కి పడిపోయిందని నివేదిక వెల్లడించిందన్నారు. అంటే కేసీఆర్ హయాంలో మద్యపానం 3.8% తగ్గిందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఈ సర్వే విరుద్ధంగా ఉండటం గమనించాలన్నారు. మద్యపాన సమస్యను పరిష్కరించడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విధానాల ప్రభావం ఎలా ఉందో ఈ సర్వేలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు.