సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడప దాటదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయన్నారు. వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గురుకులాల తీరు ఉందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల దీన స్థితే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.