బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాను వర్షాలు కుదిపేస్తున్నాయి. తిరుపతిలో వర్షాలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు తిరుమలకు వెళ్లే ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా జేసీబీల ద్వారా వాటిని తొలగిస్తున్నారు. మరో వైపు వర్షాల నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనాని వైపు భక్తులను అనుమతించడం లేదు. వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు. భారీ వర్షాలకు కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లో వరద తీవ్రమైంది. రాజీవ్గాంధీ కాలనీ, ఆటోనగర్, కొరమీనుగుంటలో వరద వస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్వేపై వరద ప్రవహిస్తోంది. మరో వైపు భారీ వర్షాలతో రేణిగుంట ఎయిర్ పోర్టు రన్వేపైకి నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తి హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న ఇండిగో విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు.