ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ తిరుమల కొండపై ఓ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదు. కానీ ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. సంఘ విద్రోహ శక్తుల నుంచి తిరుమలకు ముప్పు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. తిరుమల ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. అయినా హెలీకాఫ్టర్లు , విమానాలు కొండపై తిరగడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ హెలీకాఫ్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయిందనే దానిపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఏవియేషన్ అధికారులకు టీటీడీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది.