ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ రావడం కలకలం రేపుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎంకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన్యం ప్రాంతం కావడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొనడం సంచలనంగా మారింది. సదరు వ్యక్తిని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ ఆర్మీ జవాన్ సూర్యప్రకాష్గా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టారు. ఈ విషయం పై హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.