ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్ , బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిణి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు మార్చి 10వ తేదీన చివరి రోజుగా నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ శాసనసభ భవనంలో నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్లు పరిశీలించి, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.