తాము వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగానే నడుచుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని, డిప్యూటీ సీఎం కంటే ఎక్కువగా మాజీ సీఎం జగన్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించామని చెప్పారు. రాజకీయ నాయకుడు ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తాను చిన్నప్పటి నుంచే చట్టసభలను చూస్తూ పెరిగినట్లు చెప్పారు. అప్పట్లో వ్యక్తిగత దూషణలుండేవి కావన్నారు. ప్రజలకు ఏం కావాలో దానిపైనే చర్చలు జరిగేవని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల బాధ్యత లేకుండా గవర్నర్ స్పీచ్ను అగౌరవపరిచి వెళ్లారన్నారు.గతంలో తాము బెంచీల వద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని, ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదని పేర్కొన్నారు.
తల్లికి వందనం డబుల్…
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం పథకాన్ని మేలో ప్రారంభిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు. బడ్జెట్లో ఈ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించామని, గత ప్రభుత్వంలో ఏడాదికి రూ.5,540 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపు రెట్టింపుగా ఇస్తోందని, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వారుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అందుతుందని స్పష్టం చేశారు.