ఇటీవల సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, వీరి విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణమని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సినీ లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. తారలంతా కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ సైతం తనకు మంత్రి క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంతో కేటీఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.ఈ పిటిషన్ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, ఈరోజు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదని విశ్వనీయ సమాచారం. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను నేడు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. కానీ నేడు బీఆర్ఎస్ నేతలు కోర్టుకు రాకపోవడం వల్ల కేసును సోమవారానికి వాయిదా వేశారు.