తెలంగాణలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. రాష్ట్ర సచివాలయంలోనే కాదు చివరికి గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని పేర్కొన్నారు. గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెలా, సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెలా అని ప్రశ్నించారు. పడకేసిన పారిశుద్ధ్యంతో ప్రజలు రోగాలపాలు అవుతన్నారని, వీధి దీపాలు వెలగక పల్లెల్లో చిమ్మ చీకట్లు నిండుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసల్లేవు, పంచాయతీ ట్రాక్టర్ కు డీజిల్ పోసే దిక్కు లేదు అని పేర్కొన్నారు. ప్రజాపాలనా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కళ్లుతెరవరా అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు. నాడు పంచాయతీలకు కడుపునిండా నిధులు అందేవని, కాంగ్రెస్ వచ్చింది.. మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చిందని తెలిపారు. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ లు అప్పులపాలయ్యారని, నేడు జేబుల నుంచి ఖర్చుచేసిన కార్యదర్శులకు కూడా తిప్పలు తప్పడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యల పంచాయతీని తీర్చాలని డిమాండ్ చేశారు.