బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికి ఎక్కాయని ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ రాష్ట్రంలో హామీల అమలుకు, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు, రిటైర్ అయినవారికి పెన్షన్లు ఇచ్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఓ అసమర్థుడి పాలనలో రాష్ట్రంలో ఆర్థిక రంగం అల్లవకల్లోలం అవుతోందని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదని, రాష్ట్ర సంపద పెంచడం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఆదాయం లేదనడం సరికాదని, సీఎం రేవంత్ రెడ్డి మెదడులో విషయం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన స్టెచర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ… స్టెచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థికరంగాన్ని చిందరవందర చేశారని, తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నారన్నారు.
జీతాలు ఆపడం సిగ్గు చేటు….
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఆపడం సిగ్గు చేటని కేటీఆర్ విమర్శించారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తానని మాటిచ్చి, నేడు స్వయంగా సీఎం స్థాయిలో ఉండి జీతాలు ఆపుతున్నానని ప్రకటించడంపై మండిపడ్డారు. అటు ప్రజలకు ఆరు గ్యారంటీలు, ఇటు నిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు.