సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని, సహాయక చర్యలు ఎలా ముందుకు సాగుగాయని ప్రశ్నించారు. ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు సీఎంకు సమయం ఉంది కానీ ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లేందుకు మాత్రం సమయం లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట ఓట్ల వేట మాత్రమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున్న వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తోందని, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అని సీఎం ప్రవర్తిస్తున్నారని అన్నారు. సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడతారని హెచ్చరించారు.