అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు రూ.6 వేల కోట్లు ఎవడి అబ్బ సొత్తు అని పంచి పెడతాం అంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకు ట్రిలియన్ డాలర్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ చేస్తారంట అని సెటైర్లు వేశారు. ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ కాదు కానీ ట్రిలియన్ డాలర్ల అప్పులు చేస్తారన్నారు. ఈ బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అప్పు 2014 నుండి ఈరోజు వరకు రూ.4,37,000 కోట్లు అని బడ్జెట్లో పేర్కొన్నారన్నారు. కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసినవన్నీ అసత్య ప్రచారాలని ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తేలిపోయిందని చెప్పారు.