తెలంగాణలో రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ సర్కార్ భరతం పడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పంటల పరిస్థితి, రైతుల సమస్యలపై కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ముంచుకొస్తున్న ముప్పును ముందే హెచ్చరించినా.. ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదని విమర్శించారు. కల్ప తరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా విషం తప్ప విషయం లేని ముఖ్యమంత్రి వినిపించుకోలేదన్నారు. కళ్లముందే పచ్చని పంటలు ఎండుతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని చెప్పారు. ఓవైపు రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక అన్నదాత అల్లాడుతున్న సమయంలో గోరి చుట్టు మీద రోకలి పోటులా పంటలు ఎండటంతో రైతు బతుకు ఆగమైందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు కాబట్టి రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. ఎండిన ప్రతి ఎకరానికి వెంటనే రూ.25 వేల నష్ట పరిహారం ప్రకటించి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.