సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నేడు కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. జగిత్యాలలో ఇటీవల జరిగిన రాజకీయ హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరుతో ఉన్న విద్యుత్తును పోగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అదానీ, అంబానీ లకు సిరిసిల్ల నేతన్న లకి ఒకే కేటగిరి ఎలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని, చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ తన ఆలోచన విధానాలను మార్చుకోవాలని, గత పది నెలల కాంగ్రెస్ పాలనలో పది మంది నేతన్నలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. దీపావళి ముందే బాంబులు పేలుతాయని మంత్రి పేర్కొనగా ఈడీ రైడ్స్ గురించి చెప్తాడు కావచ్చని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇక కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఓ రాజకీయ వ్యభిచారి అంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.