ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుసగా గుడ్బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు పార్టీ మారిన సంగంతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీకి ఓ కీలక నేత గుడ్ బై చెప్పారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ నేడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సుధీర్ కు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుధీర్ వైసీపీతో పాటు, మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన లేఖను కుప్పం మున్సిపల్ కమిషనర్కు పంపించినట్లు సుధీర్ వెల్లడించారు. సీఎం చంద్రబాబుతో ఏపీ అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నానని, అందుకే పదవులకు రాజీనామా చేసి ఆయన వెంట నడిచేందుకు వచ్చానని సుధీర్ వెల్లడించారు.