ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గం. నుండి 27న సాయంత్రం 4 గం. వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. వైన్సులతో పాటు బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు సైతం మూసివేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో మద్యం దుకాణాలు బంద్ అవనున్నాయి. ఫిబ్రవరి 27న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 3న ప్రకటించనున్నారు.