తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. వీరితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం తీగల మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో టీడీపీలో చేరతానని ప్రకటించారు. కాగా, మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం కేవలం తమ ఇంట్లో పెళ్లికి ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చామన్నారు. కాగా, పార్టీలో చేరే వాళ్లతో జరిగిన సమావేశంలో మల్లారెడ్డి కూడా పాల్గొన్నట్లు చర్చ నడుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పార్టీ మారేందుకే మల్లారెడ్డి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే సీఎం రేవంత్, మల్లారెడ్డి మధ్య జరిగిన రాజకీయ విమర్శల గురించి అందరికీ తెలిసిందే. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. కొద్ది రోజుల నుంచి మల్లారెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కాగా, హైడ్రా తన కాలేజీలకు ఇప్పటికే నోటీసులు పంపినట్లు సమాచారం. మల్లారెడ్డి రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభించారు. మరో వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి తన అల్లుడితో కలిసి టీడీపీలో చేరతారనే చర్చ నడుస్తోంది.