బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు వ్యవహారాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతున్న క్రమంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఫాం హౌస్కే పరిమితం చేశారని, కేసీఆర్ ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతూ, పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన గొడవ పడేలా వ్యవహారించాడన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని, ఇన్ని రోజులు పట్టించుకోని వారిని కూడా ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. గంధపు చెక్కల వ్యాపారి ఒకరు వారి గురించి అగౌరవంగా మాట్లాడారని, వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.