మాజీ సీఎం వైయస్ జగన్ పోలవరం నిర్వాసితులను మోసగించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో మంత్రి నిమ్మల పర్యటించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైయస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం రూ.832 కోట్లు విడుదల చేసిందని, ఈ నగదు చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వాసితుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు చెప్పారు. వైయస్ జగన్ నిర్వాసితులకు రూ.10 లక్షలు పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలో ఉన్న ఐదేళ్లలోఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.