తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అందించే కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 26 నుండి ఇచ్చే కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల 81 లక్షల మందిలో ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని వెల్లడించారు. అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఎవరూ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, రేషన్ కార్డులు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.