– బాలికకు మద్యం తాగించి అత్యాచారం
ఏపీ డిప్యూటీ సీఎం ఇలాఖాలో దారుణం జరిగింది. ఓ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఇందిరానగర్ లో మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిగా పేర్కొంటున్న మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జాన్ బాబుకు మరో మహిళ సహకరించినట్లుగా ఆరోపిస్తున్నారు. బాలికను బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది, పోలీసుల అదుపులో జాన్ బాబుతో పాటు మరో మహిళ ఉన్నారు. పోలీసుల విచారణలో ఇద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని తెలిసింది. జాన్ బాబు ఆటో ఎందుకు ఎక్కించుకున్నావంటే మామూలుగానే ఎక్కించుకున్నాను.. మీరు ఏం చేసినా పర్వాలేదని సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం రోజు ఆటో నడుపుకుంటూ వచ్చిన జాన్ బాబు.. మరో మహిళ.. ఓ కాగితం చూపించి మైనర్ అయిన దళిత బాలికను అడ్రస్ అడిగారు. ఆ బాలిక అడ్రస్ చెబుతుండగానే ఆమెపై మత్తు మందు స్ప్రే చేసి ఆటోలో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. పిఠాపురం శివారు మాధవపురం రోడ్డులోని డంపింగ్యార్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడకు తీసుకెళ్లిన తర్వాత బాలికకు బలవంతంగా మద్యం తాగించి సదరు వ్యక్తి ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో కూడా తెలియని ఆ బాలిక షాక్లో అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది. ఆ తర్వాత బాలికను మళ్లీ ఆటో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన ప్లాస్టిక్ వస్తువులు సేకరించే మహిళ వారిని నిలదీసింది. వెంటనే బాలిక బంధువులకు సమాచారం అందించింది. బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని, మహిళను పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల విచారణలో ఏం తేలుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.