ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడి టీడీపీ , జనసేన పార్టీల్లో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్సీ వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని సమాచారం. జయమంగళ వెంకటరమణ కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పని చేశారు. గత వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్ సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పుడు జగన్ వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపించారు.