కాలం మారుతోంది… టెక్నాలజీ పరుగులు పెడుతోంది… ఆడపిల్లలు మగ వాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పాత కాలపు ఆచారాలతో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కర్ణాటకలో ఓ బాల్య వివాహం గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. హోసూర్లో ఈ ఘటన జరిగింది. ఓ బాలికను ఓ వ్యక్తి బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో బీడు భూముల్లో బాలిక ఏడుస్తున్నా ఓ వ్యక్తి ఆమెను ఎత్తుకొని పారిపోతున్నాడు. అతడి వెంట ఓ మహిళ, ఓ మరో వ్యక్తి కూడా ఉన్నారు. తమిళనాడులోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ గ్రామానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకొని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. బాలిక కుటుంబ సభ్యులు.. మార్చి 3న కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్ (29) అనే వ్యక్తితో బెంగళూర్లో పెళ్లి చేశారు.ఈ పెళ్లి బాలికకు ఇష్టం లేదు. దీంతో బాలిక అత్తమామల ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో మాదేష్, మాదేష్ అన్నయ్య మల్లేష్ ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ వీడియో పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులకు విషయం తెలిసింది. బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మాదేష్తో పాటు అతని సోదరుడు మల్లేష్, అతడి భార్య, అమ్మాయి తల్లి నాగమ్మను, తండ్రిని అరెస్టు చేశారు.