సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దురలవాట్లకు బానిసైన ఓ కొడుకు తన సొంత తల్లినే కత్తితో పొడిచి చంపేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ తల్లి నేడు ప్రాణాలు విడిచింది. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లోని డివినో విల్లాస్లో ఉంటున్న మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతులకు ఇద్దరు మగపిల్లలు సందీప్ రెడ్డి, కార్తీక్ రెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు సందీప్ రెడ్డికి ఏడాది క్రితం వివాహమైంది. కాగా, చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి డిగ్రీ పూర్తి చేశాడు. మద్యం, మత్తు పథార్థాలకు బానిసై ఇంట్లోనే ఉండేవాడు. ఈ క్రమంలో అతడిని కోయంబత్తూర్ లోని ఓ రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించారు. నెల రోజుల తర్వాత ఇటీవల కార్తీక్ రెడ్డి ఇంటికి తిరిగి వచ్చాడు. అందరూ కార్తీక్లో మార్పు వచ్చిందని భావించారు.తెల్లాపూర్ సమీపంలో తమకు ఉన్న ఎకరా భూమిని తన పేరు మీద రాయాలని కార్తీక్ రెడ్డి కొద్ది రోజులుగా తల్లిదండ్రులతో గొడవ పెడుతున్నాడు. సోమవారం ఈ విషయమై తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో తల్లి రాధికారెడ్డిపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డుకోబోయిన తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. రాధికారెడ్డిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. పోలీసులు కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.