ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత వైయస్ జగన్ తీరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత వైయస్ జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ… జగన్ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ ను అవమానపరిచే విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వైసీపీ నేతలకు ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చని సూచించారు.