తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే వారు ఏదైనా వస్తువులు మరిచి పోవడం, టికెట్ తీసుకున్నాక చివరలో చేంజ్ తీసుకోకుండానే బస్సు దిగిపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పుడు చాలా వరకు బస్సుల్లో కండక్టర్ల వద్ద చిల్లర ఉండటం లేదు. ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద నోట్లు ఇస్తే టికెట్ వెనకాల అమౌంట్ రాసి బస్సు దిగేటప్పుడు తీసుకోండి అంటున్నారు. ఇలాంటి సమయాల్లో కొందరు డబ్బులు తీసుకోవడం మర్చిపోయి బస్సు దిగేస్తుంటారు. ఇలా మర్చిపోతే ఒక్క ఫోన్ కొడితే డబ్బులు వెనక్కి ఇస్తామని ఆర్టీసీ ప్రకటించింది. దీని కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఇచ్చింది. చిల్లర తీసుకోవడం మర్చిపోయినా, బస్సులో ఏదైనా పోగొట్టుకున్నా, బస్సులో ప్రయాణిస్తూ మధ్యలో భోజనం కోసం ఆగి బస్సు మిస్ అయ్యినా ఏం భయం అవసరం లేదని చెప్పింది. 040-69440000 అనే టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి వివరాలు చెప్తే తప్పకుండా సాయం అందుతుందని తెలిపింది.