సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయర్లకు టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. వారు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్లు ఎంతో మంది సాధారణ యువత ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని తెలిపారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసే వీడియోలు చేయొద్దని సూచించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు. బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారు. మీ స్వలాభంకోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం!? సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలి. స్వార్ధ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండి.. అంటూ ఆయన పోస్టులో వివరించారు.