సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండ రాయితో తలపై మోది హత్య చేశారు. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు ఆరు నెలల కిందట భార్గవి అనే అమ్మాయిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని భార్గవి సోదరుడు కొద్ది రోజులుగా వీరిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మహేశ్ అనే పేరుతో కృష్ణకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కృష్ణ ఓ వ్యక్తిని కలిసేందుకు బయటకు వెళ్తున్నట్లు భార్గవికి చెప్పి బయలు దేరాడు. ఇంతలోనే జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసి కెనాల్ కట్టపై శవమై కనిపించాడు. యువకుడిని బండ రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో వైపు భార్గవి సోదరుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించి విచారణ చేపట్టారు. భర్త మృతితో భార్గవి కన్నీరుమున్నీరుగా విలపించింది.