తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికంటుతున్నాయి. సామాన్యులకు ఏం కొనాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదు తరుణంలో కూరల్లో కామన్గా వాడే మరో రెండు ఐటెమ్స్ రేట్లు జనాలను మరింత ఇబ్బందిపెడతున్నాయి. టమాటా కొనేటట్టు లేదు.. ఉల్లిగడ్డు తినేటట్టు లేదు. కోయకుండానే ఉల్లిగడ్డ ధరలతోనే కన్నీళ్లు తెప్పిస్తోంది. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటింది. డిమాండ్కు సరిపడ టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఉల్లి ధర కూడా భారీగానే పెరిగింది. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. కేంద్రం ఉల్లి ఎగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి. ఐతే సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి కేంద్రం బఫర్ స్టాక్ను రిలీజ్ చేసింది. అలాగే నాఫెడ్ ద్వారా 35 రూపాయలకే కిలో ఉల్లిని విక్రయిస్తోంది. ఇక, వెల్లుల్లి ధర కూడా భారీగానే పెరిగింది. మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో 500 పలుకుతోంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక స్కిన్ లెస్ చికెన్ కిలో 300లకు పెరిగింది. కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. గుడ్డు ఒక్కొటి 6 రూపాయలు పలుకుతున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా వంట నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యులకు నిత్యావసర సరుకులు కొనుక్కొని తినడం కూడా గగనంగా మారింది.