సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఎస్వీ కళాశాల సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న సమయంలో ఒక బస్సు క్లీనర్ బస్సు అద్దం పగిలి ముందుకు ఎగిరిపడగా అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసులు గాయపడ్డ వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. గుంటూరుకు చెందిన వాసులు సాయి, రసూల్లు మృతి చెందినట్లుగా నిర్ధారించారు.