మన మాతృ భాష తెలుగును రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరు తెలుగు భాషను రక్షించుకోవడంలో భాగం కావాలన్నారు. తెలుగులో రాయడం, మాట్లాడటం ద్వారా భాషను పరిరక్షించగలమని ఆయన పేర్కొన్నారు. పిల్లలను తెలుగు సాహిత్యం చదవడంలో ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో బోధన జరగాలని చెప్పారు. డిజిటల్ రంగంలో కూడా భాషాభివృద్ధికి పాటుపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన, అధికార వ్యవహారాలు తెలుగులోనే జరపాలని కోరారు. కోర్టులో సైతం వాదనలు తెలుగులో జరగాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాల పేర్లు కూడా తెలుగులోనే ఉండాలని అభిప్రాయపడ్డారు.