టీం ఇండియా ఐసీసీ చాంపియన్ ట్రీఫీ విజయంపై భారత్లో సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘనటలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. పోలీసులు లాఠీ చార్జ్ కు దిగడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, కేపీహెచ్బీ కాలనీ, కరీంనగర్లోని గీతాభవన్ సర్కిల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి ఓ పోస్టు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఇదీ పరిస్థితి… భారత్ విజయంపై కనీసం వేడుకలు చేసుకునే అవకాశం కూడా లేదని పేర్కొంటూ రెండు వీడియోలను షేర్ చేశారు.
పోలీసులు ఏ దేశానికి మద్దతిస్తున్నారు..
పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ…కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ హోం మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. భారతదేశ విజయాన్ని మనం జరుపుకోలేము కానీ పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా అని నిలదీశారు. భారత్ విజయాన్ని జరుపుకోవడం “మతపరమైన సమస్య” ఎలా అవుతుందని నిలదీశారు.