కాంగ్రెస్ ఎంపీపై రాళ్లతో దాడి

ఓ కాంగ్రెస్ ఎంపీపై రాళ్లు, క‌ర్ర‌ల‌తో జ‌నం దాడి చేయ‌డంతో తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. ఈ ఘ‌ట‌న బీహార్‌ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… కాంగ్రెస్ ఎంపీ మ‌నోజ్ కుమార్ సోద‌రుడు ఇటీవ‌ల వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘం ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఈ నేప‌థ్యంలో నాథూపూర్ గ్రామంలో ఓ ర్యాలీ నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలోకి ర్యాలీగా వెళ్లిన స‌మ‌యంలో ఎంపీ మ‌నోజ్ కుమార్ కారు రోడ్డు ప‌క్క‌న ఉన్న స్థానికుల‌కు త‌గిలింది. దీంతో ఆగ్ర‌హానికి గురైన గ్రామ‌స్థులు కారు డ్రైవ‌ర్‌పై దాడికి దిగారు. ఎంపీ అనుచ‌రులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోగా వారిపై కూడా దాడి చేశారు. ఎంపీ స్వ‌యంగా వ‌చ్చి గ్రామ‌స్థుల‌ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించారు. అయినా గ్రామ‌స్థులు విన‌కుండా ఎంపీపై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. ఎంపీ మ‌నోజ్ కుమార్ త‌ల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో వార‌ణాసిలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *