నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో రోడ్డు నిర్మాణం కోసం ఇండ్లు కూల్చివేయడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. జడ్చర్ల- కోదాడ 167వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చారకొండలో 29 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీని కోసం ముందస్తుగానే గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గ్రామం మధ్యలో నుంచి రోడ్డు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తూ, తమ ఇండ్లను కూల్చివేయొద్దంటూ పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.