విశాఖ‌ను రాష్ట్ర ఆర్థిక రాజ‌ధాని చేస్తాం

విశాఖ న‌గ‌రాన్ని రాష్ట్ర ఆర్థిక రాజ‌ధానిగా అభివృద్ధి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. శ‌నివారం సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌లు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. సీఆర్‌డీఏ ఆఫీసు పనుల‌ను మంత్రి నారాయ‌ణ‌తో క‌లిసి ప్రారంభించారు. గ‌తంలో టీడీపీ హ‌యాంలో రూ.160 కోట్లతో సీఆర్‌డీఏ ఆఫీసు పనులు చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులను నిలిపేశారు. కాగా, 3.62 ఎకరాల్లో ఏడంత‌స్తుల‌ భవనాన్ని ఇక్కడ నిర్మించ‌నున్నారు. పార్కింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌కు మ‌రో రెండున్న‌ర‌ ఎకరాల స్థ‌లం కేటాయించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ… రాష్ట్ర విభజనతో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డామ‌న్నారు.ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దిన‌ట్లు తెలిపారు. ముందుచూపుతో సైబరాబాద్‌లో బ్ర‌హ్మాండ‌మైన ఎనిమిది వ‌రుస‌ల ర‌హ‌దారులు నిర్మించామ‌న్నారు. అప్ప‌ట్లో అంద‌రూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5 వేల ఎకరాల స్థ‌లం దేనిక‌ని ప్ర‌శ్నించార‌ని గుర్తు చేశారు. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటార‌ని, అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా మ‌న ప‌ని మ‌నం చేసుకుపోవాల‌ని చెప్పారు. అమరావతి రైతులను ఒప్పించి భూమి సేకరించామ‌ని, రాజధాని, సమాజ హితం కోసం రైతులంతా భూములిచ్చార‌న్నారు. అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరించామ‌ని, మహిళా రైతులు గ‌త వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడార‌న్నారు. అమ‌రావ‌తిని అభివృద్ధి చేస్తామ‌ని, విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి, కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఏపీకి బుల్లెట్‌ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన‌ట్లు తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, అమరావతి మీదుగా బుల్లెట్‌ రైలు రావాల‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *