కూటమి నేతలు ఎన్నికల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రచారం చేస్తే.. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అయ్యిందని వైయస్ జగన్ విమర్శించారు. నేడు వైయస్ జగన్ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలపై సెటైర్లు వేస్తూ ముసలావిడ కూడా బటన్లు నొక్కుతుందని అన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఒక్క హామీ నెరవేర్చుకోలేదన్నారు. ప్రజలకు హామీల గురించి ఇంటింటా బాండ్లు పంచి పెట్టారని, ఆ బాండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చకపోతే చొక్కాలు పట్టుకొని నిలదీయండి అన్నారని, ఇప్పుడు ఎవరి చొక్కాలు పట్టుకోవాలని అడిగారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో 1.4 లక్షల కోట్లు అప్పుటు చేశారని, ఒక్క హామీ కూడా నెరవేర్చకున్నా చేసిన ఈ అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఒక్క పథకం కూడా లేకుండా చేశారని చెప్పారు. రూ.పది వేలు ఇస్తామని వాలంటీర్లను మోసగించారని, కొత్తగా ఉద్యోగాలు ఏం ఇవ్వలేదని విమర్శించారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో అక్రమాలతో అడ్డగోలుగా ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ఆస్తుల్ని అమ్మేసి చంద్రబాబు తన జేబులు నింపుకుంటున్నాడన్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే, చంద్రబాబు ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జనాలకు అబద్దాలు మాత్రమే చెబుతున్నారన్నారు.