ఏపీలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలతో కలిసి విద్యార్థులు, నిరుద్యోగులు ధర్నాకు దిగారు. పలు చోట్ల యువతను పోలీసులు అరెస్టు చేశారు. కూటమి నేతలు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి సంతకం డీఎస్సీ పైనే పెట్టారని, ఇప్పటికీ డీఎస్సీ ఖాళీలు భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని ఇటీవల ఎంతోమంది నిరుద్యోగులు ఆందోళన చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు.